కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయశాంతి
By: Sankar Thu, 10 Dec 2020 8:28 PM
భారతీయ జనతా పార్టీలో చేరిక అనంతరం తొలిసారి హైదరాబాద్ చేరుకున్న విజయశాంతికి ఘన స్వాగతం లభించింది. ఆమె గురువారం మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ 2023లో కేసీఆర్ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ధీటుగా నిలబడేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..
నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్. తనకన్నా బలమైన నేతలెవరూ ఉండకూడదనేది ఆయన ఆలోచన. కేసీఆర్లా మాట మార్చడం నాకు రాదు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని మోసం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది చనిపోయారు. వాళ్ల శవాల మీద కూర్చొని కేసీఆర్ పరిపాలిస్తున్నారు.
కేసీఆర్ ఎన్నడూ తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. ఆయనకు డబ్బులే ముఖ్యం. ఏం చేసుకుంటారు దొర డబ్బుని. ఎల్లకాలం అబద్ధాలతో మోసం చేయలేరు. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. కేసీఆర్కు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని అన్నారు