నిరుద్యోగుల ఓట్ల కోసమే నోటిఫికేషన్ డ్రామా ..బండి సంజయ్
By: Sankar Sun, 13 Dec 2020 10:09 PM
ఉద్యోగ నోటిఫికేషన్ ఒక ఎన్నికల డ్రామా అని, నిరుద్యోగుల ఓట్ల కోసమే కేసీఆర్ పేపర్ ప్రకటన చేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓట్ల కోసమే నోటిఫికేషన్ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్కు నిజంగా నిరుద్యోగులపై చిత్తశుద్ది ఉంటే అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు..
బీజేపీ ఆందోళనను ముందుగానే పసిగట్టి భయంతో నోటిఫికేషన్ అని పేపర్ ప్రకటన చేశారని విమర్శించారు. నోటిఫికేషన్ తప్పుల తడకగా ఇచ్చి కోర్డుల ద్వారా రద్దు చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్ మాయల పకీరు మాటలు విని మోసపోయే రోజులకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కడుపుమంట లో కేసిఆర్ కాలిపోయే రోజులు వచ్చాయని బండి సంజయ్ విమర్శించారు.
పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు..ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.