సన్ రైజర్స్ కెప్టెన్ గా ఎంపికైన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ 'డేవిడ్ వార్నర్'
By: chandrasekar Wed, 29 July 2020 3:06 PM
ఆస్ట్రేలియా స్టార్
ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్
హైదరాబాద్ జట్టుకు మళ్లీ సారథిగా ఎంపికవడాన్ని గౌరవంగా
భావిస్తున్నానని అన్నాడు. ఈ సీజన్ లో
జట్టుకు మరో టైటిల్ ను
అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంగళవారం మీడియాకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా
ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. వార్నర్ నేతృత్వంలోని సన్ రైజర్స్ 2016 ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే 2018లో
బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురయ్యాక
వార్నర్ సన్ రైజర్స్
కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. దీంతో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ జట్టును
నడిపించాడు. గతేడాది మళ్లీ వార్నర్ ఐపీఎల్ లో పునరాగమనం చేసి 697 పరుగులతో
అదరగొట్టాడు. అయితే ఈ ఏడాది సీజన్ కోసం
సన్ రైజర్స్ యాజమాన్యం వార్నర్ ను
మరోసారి కెప్టెన్ గా నియమించింది.
కెప్టెన్ గా ఎంపికైన విషయంపై తాజాగా వార్నర్ స్పందించాడు. “సన్
రైజర్స్ కు కెప్టెన్ గా ఉండడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా. మళ్లీ
సారథ్యం దక్కడం గొప్ప విషయం. అయితే జట్టులోని ప్రతి ఒక్కరూ నాయకుడే. విలియమ్సన్ - నేను
ఎప్పుడూ ఆలోచనలు పంచుకుంటాం. నేను ఏ స్థానంలో ఉన్నా ఏ తేడా ఉండదు. నేను గతేడాది
కూడా నాయకుడిననే అనుకున్నా. పేరు ముందు సి(కెప్టెన్ ) అని ఉందా లేదా అనేది నేను పట్టించుకోను” అని
వార్నర్ స్పష్టం చేశాడు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ను యూఏఈలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది.