ఏపీ ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ ..కరోనా భీమా కల్పించిన యాజమాన్యం
By: Sankar Wed, 19 Aug 2020 8:23 PM
ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. అర్టీసీ కార్మికులకు కరోనా బీమా వర్తింపజేయాలని యాజమాన్యం బుధవారం నిర్ణయం తీసుకుంది. కార్మిక పరిషత్ నేతలు నిన్న(మంగళవారం) ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబును కలిసి బీమా కల్పించాలంటూ కార్మికులు వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు 50 లక్షల రూపాయల కోవిడ్ బీమా వర్తింపచేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది
అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీని ఆర్టీసీ కార్మికులకు కూడా వర్తింపజేస్తూ ఎండీ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కరోనాతో ఇప్పటివరకు మరణించిన 36 మంది ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ బీమా వర్తింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందుకోసం మృతుల వివరాలతో సహా ధ్రువపత్రాలను ఈ నెల 28లోపు ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపాలని ఏండీ కృష్ణబాబు జిల్లాల ఆర్ఎంలను ఆదేశించారు. దీంతో కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాల కార్మికులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు.