కిడ్నీ రోగికి ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక సాయం
By: Dimple Sat, 05 Sept 2020 09:29 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్రెడ్డి పాలన సంస్కరణలతో వైద్యాన్ని పెద్దపీటవేసి ప్రజలనుంచి అభినందనలు అందుకుంటున్నాడు. తాజాగా... కిడ్నీ వ్యాధితో ప్రాణపాయకర పరిస్థితుల్లో ఉన్న ఓ బాలుడికి తక్షణసాయంకింద ఆర్థిక సాయం అందించాడు.
కృష్ణా జిల్లా పెడనలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలుడికి తగిన ఆర్థిక సాయం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
పెడన పట్టణం 7వ వార్డుకు చెందిన వాసా కుమార స్వామి, మధులత దంపతుల కుమారుడు రేవంత్ కుమార్ గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరి మృత్యువుతో పోరాడుతున్నాడు.
పట్టణ వైసీపీ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న శాసనసభ్యుడు జోగి రమేష్.. ముఖ్యమంత్రి కార్యాలయ వైద్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు ఆ బాలుడికి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి రూ.10 లక్షలు మంజూరు చేశారు.
దీనికి సంబంధించిన అధికారిక లేఖను ఎమ్మెల్యే జోగి రమేష్ శుక్రవారం ఆ బాలుడి కుటుంబానికి అందజేశారు. వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.