తంటికొండ ఘాట్ రోడ్డు వ్యాన్ యాక్సిడెంట్ ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య
By: Sankar Mon, 02 Nov 2020 10:18 AM
తంటికొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.
రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి సుజాత (38) ఆదివారం మృతి చెందినట్టు గోకవరం ఎస్సై పి.చెన్నారావు చెప్పారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో సుజాత కుమార్తె హేమనీ శ్రీలలిత (13), పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) దుర్మరణం పాలయ్యారు. మృతురాలు సుజాత పెళ్లి కుమారుడికి సోదరి. ఈమెకు గాదరాడకు చెందిన పెద్దరాజుతో 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడితో పాటు కుమార్తె హేమనీ శ్రీలలిత ఉన్నారు..
ఇక తంటికొండ దేవస్థానంలో ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని దర్యాప్తు అధికారి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సెంట్రల్ డీఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. వ్యాన్పై వెళ్లిన పెళ్లి బృందం కొండ పైనుంచి కిందకు దిగుతుండగా వాహనం అదుపు తప్పి పడిపోయిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ మద్యం తాగాడా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్టును బట్టి తేలుతుందని ఆయన చెప్పారు