ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: నిమ్మగడ్డ రమేష్ కుమార్
By: chandrasekar Tue, 17 Nov 2020 7:55 PM
రానున్న ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ప్రకటన
చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం
తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి న్యాయపరమైన
ఇబ్బందులు లేవని చెప్పారు. ఇవి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని వివరించారు.
ఏపీలో కరోనా ఉధృతి కూడా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి
పడిపోయాయని గుర్తు చేశారు.
ఇప్పుడు రాష్ట్ర
ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల
నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల
కోడ్ అమల్లో లేదని, ఎలక్షన్స్కు 4 వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.
ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు
చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా
కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమన్నారు. ఎన్నికల
నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని
వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ
రమేష్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు తగిన ఏర్పాట్లు చేసుకోనున్నాయి.