తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం
By: chandrasekar Thu, 02 July 2020 4:28 PM
ప్రతి ఆషాఢ మాసంలో
జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం
ఆనవాయితీగా వస్తున్నది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల
పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం బుధవారం ప్రారంభమైంది.
కరోనా వైరస్ వ్యాప్తి
నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆలయ
అర్చకులు చక్రవర్తి శేషాద్రి దీక్షితులు కంకణభట్టార్గా వ్యవహరించారు.
కార్యక్రమంలో భాగంగా ఉదయం శతకలశస్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.
ఆ తరువాత ఆలయంలోని
కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు
స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి
కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి
సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపడతారు.