40 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్..
By: Sankar Tue, 28 July 2020 3:12 PM
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. అధికార పార్టీ నేతలతో పాటు... వారి సహాయ సిబ్బంది అధికారులు, పోలీసులు అంతా వైరస్ బారిన పడుతున్నారు. జిల్లాల్లో కూడా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్లో కరోనా కలకలం రేపింది.
శిక్షణలో ఉన్న 40 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం అక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి చెందిన 850 మంది కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్నారు. 40 మందికి పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగతా సిబ్బంది, అధికారుల్లో ఆందోళన నెలకొంది. మిగతావారికీ వైద్య సిబ్బంది పరీక్షలు చేయనున్నారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,610 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు