మెట్రో స్టేషన్ లో నాలుగు అడుగుల నాగుపాము
By: Sankar Sun, 30 Aug 2020 12:36 PM
అరణ్యాలను నరికేసి జనావాసాలుగా మారుస్తుండటంతో వన్య మృగాలు , విష సర్పాలు జనావాసాల్లోకి తరుచుగా వస్తున్నాయి దీనితో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు..ముఖ్యంగా పాములు , ఇంతకుముందు ఊరి చివర పుట్టల్లో, పొలాల్లో, అడవుల్లో ఉండేవి . కానీ అవి కూడా వలస వచ్చాయి.. జనావాసాల్లోకి! ఇంటి కప్పు మీద, వంటగదిలో, ఆఖరికి ఇంట్లోని బాత్రూమ్లోనూ పాములు ప్రత్యక్షమవుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఢిల్లీలోని సాకెట్ మెట్రో స్టేషన్ ద్వారం దగ్గర శుక్రవారం నాలుగడుగుల నాగుపాము పాగా వేసి అక్కడి సిబ్బందిని హడలెత్తించింది. దీంతో సిబ్బంది వెంటనే వైల్డ్లైఫ్ ఎస్వోఎస్ అనే స్వచ్ఛంద సంస్థకు సమాచారమిచ్చారు.
వారు ఘటనా స్థలానికి చేరుకుని ఎంతో చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం దాన్ని దూర ప్రదేశానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. ఇంకా మెట్రో రైళ్లు ప్రారంభం కాకపోవడంతో అక్కడ జనాలు ఎవరూ లేకపోయేసరికి పెద్ద ప్రమాదం తప్పింది. కాగా ఇటీవలే సాకెట్ మెట్రో స్టేషన్లో కొండచిలువను, ఓక్లా బర్డ్ సాంక్చుయరీ మెట్రో స్టేషన్లో నాగుపామును రక్షించినట్లు వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది