హైదరాబాద్లో దాదాపు 1500 కాలనీలు జలదిగ్భందంలోనే...!
By: Anji Wed, 14 Oct 2020 3:29 PM
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు హైదరాబాద్లో జన జీవనం అస్తవ్యస్థమైంది. ఊహించని స్థాయిలో 25 నుంచి 32 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కాలనీలకు కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్ల జనం పీకల్లోతు నీళ్లలో ఇరుక్కుపోయారు.
నదీంకాలనీలో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. మలక్పేట, దిల్షుఖ్నగర్, ఎల్బీనగర్, నాచారం ఇలా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడాలేదు.. వర్షపునీటిలో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా మార్గం లేక అల్లాడిపోతున్నారు. సహాయ చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలకు అదనపు బృందాల్ని పంపాలని ఆదేశించారు.
దాదాపు 1500 కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. అన్ని చోట్లా ఇళ్లలోకి నీరు చేరింది. హైదరాబాద్కి వచ్చే ప్రధాన రహదారులు కూడా దెబ్బతినడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇవాళ, రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు అన్నింటికీ సెలవులు ప్రకటించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మీర్పేట్ అయోధ్య కాలనీలోకి వరద నీరు పోటెత్తింది. వందలాది ఇళ్లు నీట మునిగాయి. నిత్యావసర సరకులు కొట్టుకుపోయాయి. వరద గుప్పిట చిక్కుకున్న తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.