రియా చక్రవర్తిపై కేసు పెట్టిన సుశాంత్ కుటుంబ సభ్యులు
By: Sankar Tue, 28 July 2020 9:19 PM
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ను గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి మోసం చేసిందని బిహార్లోని పాట్నాలో ఉంటోన్న ఆయన కుటుంబం ఆరోపిస్తోంది. ఆర్థికంగా సుశాంత్ను రియా వాడుకుందని, మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పాట్నా పోలీసులు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేశారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పాట్నా సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ వెల్లడించారు.
రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం బహిరంగంగా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల దర్యాప్తు కోసం తాము వేచి ఉండాలా అని సుశాంత్ కుటుంబం చర్చించుకున్నటు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలసిందే. సుశాంత్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు 40 మందిని ముంబై పోలీసులు విచారించారు.
ప్రస్తుతం ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే సుశాంత్ కుటుంబం పాట్నా పోలీసులకు రియాపై ఫిర్యాదు చేయడం గమనార్హం. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోన్న బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ సైతం రియాపై కేసు నమోదుచేసినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు