ఇంటి గుమ్మం ముందు సంప్రదాయ పద్ధతిలో ఆయన హారతి పట్టి ఇంట్లోకి ఆహ్వానించారు...!
By: Anji Tue, 29 Dec 2020 10:35 AM
సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్య స్థితి మెరుగవడంతో తాను చికిత్స పొందుతున్న హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ నుంచి ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కుమార్తె ఐశ్వర్య తోడుగా ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకు చేరుకున్నారు.
రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులతో బాధపడిన ఆయన మూడు రోజుల పాటు అపోలోలో చికిత్స తీసుకున్నారు. ఇంటికి వచ్చిన రజనీకి సతీమణి లత హారతితో స్వాగతం పలికారు.
ఇంటి గుమ్మం ముందు సంప్రదాయ పద్ధతిలో ఆయన నుదుట తిలకం దిద్ది, హారతి పట్టి, అప్పుడు ఇంట్లోకి ఆహ్వానించారు. రజనీకి లత హారతి పడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
రజనీ ఫ్యాన్స్ ఆ పిక్చర్ను షేర్ చేస్తూ, ఆయన ఆరోగ్యంతో ఇంటికి వచ్చినందుకు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ కామెంట్లు పెడుతున్నారు. డిసెంబర్ 15న రామోజీ ఫిల్మ్సిటీలో 'అణ్ణాత్'తే షూటింగ్ను పునఃప్రారంభించారు రజనీ.
కొన్ని రోజులు షూటింగ్ జరిపాక, యూనిట్ మెంబర్స్లో నలుగురికి కొవిడ్-19 పాజిటివ్ రావడంతో వెంటనే షూటింగ్ నిలిపేశారు. అయితే రజనీకి పరీక్షలో నెగటివ్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఆ మరుసటి రోజే బీపీ పెరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన అపోలో హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు.
మూడు రోజులు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాక ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయి, చెన్నైకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య స్థితి బాగా మెరుగయ్యిందని సమాచారం.