దేవా కట్టా సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ ..
By: Sankar Tue, 14 July 2020 10:42 AM
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫామ్లో ఉన్నారు. కిందటేడాది ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో విజయాలు అందుకుని హిట్ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం ఆయన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా మహమ్మారి వచ్చి ఉండకపోతే ఈపాటికి షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోయేవి. పరిస్థితులు చక్కబడిన తరవాత మిగిలిన షూటింగ్ను పూర్తిచేయనున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా తరవాత దేవా కట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. ఇదొక సోషియో-పొలిటికల్ డ్రామా అని సమాచారం. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ డాక్టర్గా కనిపించనున్నారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఏలూరుకు చెందిన డాక్టర్గా సాయి తేజ్ నటిస్తున్నారని అన్నారు. కానీ, ఇప్పుడు తేజూ క్యారెక్టర్పై కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయి తేజ్ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించనున్నారట. ఈ పాత్ర కోసం ప్రస్తుతం తేజూ సిద్ధమవుతున్నారని అంటున్నారు.
నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ మీడియా బ్యానర్పై జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. నిజానికి ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా వచ్చే ఏడాదే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు.