11 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇండస్ట్రీ హిట్ మగధీర
By: Sankar Sat, 01 Aug 2020 09:07 AM
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన సినిమాగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్లను చెప్పుకుంటాము ..అయితే బాహుబలి కంటే ముందు తెలుగు సినిమా స్టామినాను దేశ వ్యాప్తంగా తెలియజేసేలా చేసిన సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి కలయికలో వచ్చిన మగధీర ..
గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతలుగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. రామ్చరణ్తో పాటు ఈ చిత్రంలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్.. తమ నటనతో మెప్పించారు. ముఖ్యంగా రామ్చరణ్.. హార్స్ రైడింగ్, కాజల్ గ్లామర్, శ్రీహరి-రామ్చరణ్ మధ్య డైలాగ్ వార్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం విడుదలై 11 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్.. ఆ సినిమా సంగతులను గుర్తుచేసుకుంది. ‘ మగధీర సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్కు గురి చేసింది. ఫిల్మ్ మేకింగ్లోనూ, బాక్సాఫీస్ వసూళ్లలోనూ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. విడుదల తర్వాత దక్షిణాదిలో సన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్గా నిలిచింది’ అని పేర్కొంది...
తాజాగా ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కూడా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్కు సంబంధించిన పలు చిత్రాలనున ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. మగధీర నుంచి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు అని పేర్కొన్నారు. సోషల్ మీడియా లో కూడా 11 ఇయర్స్ ఫర్ మగధీర అని అభిమానులు ట్యాగ్ను తెగ ట్రెండ్ చేస్తున్నారు