ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతం శ్రీశైలం. కర్నూలు
జిల్లాలో ఉన్న శ్రీశైలం పట్టణం పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి జనాభా 10 వేల
కంటే తక్కువగా ఉంటుంది. సనాతన హిందూ మత సాంప్రదాయాలకు, సంస్కృతికి
ఈ ప్రాంతం ఒక చిహ్నం. శ్రీశైలం పర్యటనకు ప్రతి ఏటా దేశ విదేశీ టూరిస్టులు అధిక
సంఖ్యలో వస్తుంటారు.
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్
రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా
అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ
మల్లికార్జున స్వామి పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు
దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం
అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.
నల్లమల కొండలపై ఉన్న
శ్రీశైల మల్లిఖార్జున ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ పూజలందుకుంటున్న
మల్లిఖార్జునుడి లింగ రూపం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో
ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు కూడా మల్లిఖార్జునుడి సన్నిధికి సమీపంలో కొలువై
భక్తులకు దర్శనమిస్తారు. కార్తీక మాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
ముఖ్యంగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే మహాశివరాత్రి పండుగను వీక్షించేందుకు దేశ, విదేశాల
నుంచి భక్తకోటి తరలివస్తారు. ద్రావిడ నిర్మాణ శైలిలో రూపొందించబడిన ఈ ఆలయ శిల్ప
కళా వైభవం అబ్బురపరుస్తుంది.
పూర్వం అరుణాసురడు అనే
రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం
జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే, చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ
భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన
భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది.
తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి
పంపిస్తారు.
అరుణాసురడు దేవ గురువు
బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని
గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు
అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి
గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి
అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని
సంహరిస్తాయి.
నాగార్జున సాగర్ - శ్రీశైలం
టైగర్ రిజర్వ్ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు
రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమల
కొండలు, లోయలు, ప్రకృతి
అందాల మధ్య టైగర్ రిజర్వ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పట్టు మొక్కలు, టేకు
చెట్లు వంటి విభిన్న రకాల వృక్ష జాలంతో పాటు బెంగాల్ టైగర్, ఏనుగులు, చిరుత
పులులు, ఎలుగుబంట్లు
వంటి అనేక రకాల జంతు జాతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిని సందర్శించేందుకు
జంగిల్ సఫారీ అందుబాటులో ఉంటుంది. పర్యటకులు ఈ ప్రాంతంలో ఎంతో విలువైన సమయాన్ని
గడుపుతారు.
కృష్ణానది గుండా బోటింగ్
ద్వారా అక్కమహాదేవి గుహలకు చేరుకోవచ్చు. మార్గమధ్యంలో దట్టమైన అడవులు, పర్వతాల
యొక్క అందమైన దృశ్యాలను మీరు కనుగొనవచ్చు. ఇక్కడికి ప్రయాణం మీకు ఓ సాహసోపేత
అనుభూతిని అందిస్తుంది. కన్నడ ప్రాంతానికి చెందిన కవయిత్రి అక్కమహాదేవి శివుణ్ణి
తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి అక్కమహాదేవి గుహలు అని
పేరు స్థిరపడినట్లు చెబుతారు. ఈ గుహల్లో ఓ శివలింగాన్ని కూడా మీరు
దర్శించుకోవచ్చు. శ్రీశైలం పర్యటనలో ఈ ప్రయాణం మీకు చిరస్మరణీయంగా మారుతుంది.
శైవ క్షేత్రం
మల్లిఖార్జునుడి ఆలయానికి సమీపంలోని లోయలో పాతాళ గంగ నది ఉంటుంది. పాపాలను
పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా భక్తులు దీనిని భావిస్తారు. వనమూలికలతో నిండిన ఈ
నీటికి అనేక రోగాలను పారద్రోలే శక్తి ఉందని చెబుతారు. దూరంగా కనిపించే శ్రీశైలం
డ్యామ్ దృశ్యాలు, పచ్చని కొండలు, ప్రకృతి వైభవం మధ్య ఉండే పాతాళగంగను చూస్తే పర్యాటకుల
మనసు పులకిస్తుంది. మెట్ల మార్గం, రోప్ వే ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
శ్రీశైలం నుంచి 14
కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై శ్రీశైలం ఆనకట్ట ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని
అతిపెద్ద ఆనకట్టలో ఇది ఒకటి. దేశంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలల్లో సామర్ధ్యం
విషయంలో శ్రీశైలం ఆనకట్ట రెండవ అతిపెద్దది. డ్యామ్ పరిధిలో పర్యాటకులు బోట్ షికారు
చేసే అవకాశం ఉంది. 2200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీశైలం డ్యామ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. డ్యామ్ పై
నుంచి కనిపించే కృష్ణమ్మ పరవళ్లు టూరిస్టులకు మరపురాని అనుభవాలను అందిస్తాయి.
శ్రీశైలంలో ఓ రహస్య
ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఎంతో మహిమ గల ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. ఇక్కడి
అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం.
అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం. శ్రీశైలం కూడలి నుంచి
20
కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది.
ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి
శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి.