ఈఫిల్ టవర్ విశేషాలు


ఈ కట్టడాన్ని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి ఈఫిల్ టవర్ అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి. 1889లో దీనిని స్థాపించినప్పటి నుంచీ ఇరవై కోట్లు మందికి పైగా దీన్ని సందర్శించారు. వీరిలో అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల మంది 2006లో సందర్శించారు. ఈ కారణంగా ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి పొందింది. ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.

ఈఫిల్ టవర్ చరిత్ర

ఈ నిర్మాణం 1887, 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు,, మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.


నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు

ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు కాగా, అందులో లోహపు బరువు 7,300 టన్నులు. ఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీనిని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్, అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు. అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు. దీనిని నిర్మించేటపుడు ఈఫిల్ 72మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. వీటిని మళ్ళీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచి వేశారు కానీ టవర్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో 1986-87లో పునర్ముద్రించడం జరిగింది.