చేపల్లో ఒమెగా 3
ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను బయటకు
పంపి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా
ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే
ఒమెగా 3
ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే సాల్మన్, మాకరెల్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా వంటి చేపలను తింటే ఇంకా మంచి ఫలితం
ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. చేపల పులుసే కాదు, చేపల
వేపుడు కూడా అద్భుతంగానే ఉంటుంది.
చెరువుల్లో చేపల కంటే, సముద్ర చేపల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు
నిపుణులు. చేపల వుపయోగించి రుచికరమైన ఫిష్
ఫింగర్స్ ఎలా తాయారు చేయాలో చూస్తాం. కావలసిన పదార్థాలు:
* చేపముక్కలు - 4 * కోడిగుడ్డు - 1 * బ్రెడ్ పొడి - అరకప్పు * నూనె - వేయించడానికి సరిపడా * మైదా - 3 స్పూన్స్ * మిరియాల పొడి - అర స్పూన్ * వెనిగర్ - 2 స్పూన్స్ * కారం - 1 స్పూన్ * పసుపు - చిటికెడు * ఉప్పు - తగినంత తయారు చేసే విధానం:
కోడిగుడ్డు సొనను బాగా
గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ముళ్లు తీసేయాలి.
తరువాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కొంచం
గుజ్జులాగా తీసికోవాలి. దీన్ని ఓ బౌల్ లో తీసుకుని వెనిగర్ వేసి కలపాలి. తరువాత
మైదా, మిరియాల
పొడి, కారం, పసుపు, ఉప్పు
వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ముద్దలుగా తీసుకుని వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి, బ్రెడ్
పొడిలో అద్ది నూనెలో డీప్ ఫ్రై చేసి తీసికోవాలి. దీనిని పిల్లలు చాల ఇష్ట పడి
తింటారు. మంచి పోషకాలతో బాటు చాలా రుచిగా ఉంటాయి.