కొవిడ్‌-19 కారణంగా ఆన్‌లైన్‌లో ప్రపంచ పర్యావరణ దినం


భూమిపై పర్యావరణం లేకుండా ఏజీవీ మనుగడ సాగించలేదు. మనిషి తన స్వార్థంతో పర్యావరణ వినాశనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నాడు. విచ్ఛలవిడిగా అడవులను నరికేయడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. మానవుడు అవసరానికి మించి ప్రకృతి వనరులను ధ్వంసం చేయడంతో అనేక జీవరాశులు అంతరించే దశకు చేరుకున్నాయి.

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఆధ్వర్యంలో 1972లో నిర్వహించిన సమావేశంలో జూన్‌ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినంగా ప్రకటించారు. ఏటా ప్రపంచంలోని ఏదో ఒక నగరంలో జూన్‌ 5న అంతర్జాతీయ సమావేశం నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు కీలకమైన అంశాలపై చర్చించి మార్గదర్శకాలను రూపొందిస్తారు.

ఈ సంవత్సరం జీవవైవిధ్య థీమ్‌తో జర్మనీ భాగస్వామ్యంతో కొలంబియాలో నిర్వహించాల్సిన పర్యావరణ దినాన్ని కొవిడ్‌-19 కారణంగా ఆన్‌లైన్‌లో జరుపుకోనున్నారు. ఇటీవల జరుగుతున్న సంఘటనల ప్రభావంతో ఈ ఏడాది ‘టైమ్‌ ఫర్‌ నేచర్‌' థీమ్‌తో పర్యావరణ దినం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భావిస్తోంది.


ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేశాయి. గతేడాది బ్రెజిల్‌ అమేజాన్‌ అడవుల్లో, ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చుతో అనేక జీవుల మనుగడకు ముప్పు వాటిల్లింది. జంతువులు తమను రక్షించుకునేందుకు రోడ్లపైకి వచ్చాయి. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పట్టణాల విస్తీర్ణం పెరగడంతో అడవులు నరికివేతకు గురవుతున్నాయి.

దీనివల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జంతువులకు తిండి దొరక్క జనాల్లోకి వస్తున్నాయి. భవిష్యత్తులో పర్యావరణానికి మరింత ముప్పు వాటిల్లే అవకాశముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పర్యావరణంపై ప్ర భావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలని, ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.