రోడ్డుపై పడున్న వ్యక్తిని కాపాడి మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు


రాష్ట్ర మహిళా మంత్రులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దీనంగా పడి ఉన్న వ్యక్తిని కాపాడి మానవత్వం చాటుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతం దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు.

వెంటనే వాహనాన్ని ఆపి తనతో పాటు ఉన్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆస్పత్రికి పంపారు.

ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు మంత్రులు సుచరిత, తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు.