రెమిడెసివిర్.. కరోనా చికిత్సలో ప్రభావంతమైన ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న యాంటీవైరల్ డ్రగ్. అయితే దీన్ని కోవిడ్తో ఆస్పత్రిలో చేరిన వారికి ఇవ్వొద్దని డబ్ల్యూహెచ్వో తెలిపింది.
వైరస్ సోకిన వ్యక్తి ఎంతటి అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఈ డ్రగ్ ఇవ్వవద్దని చెప్పింది. ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం కరోనాపై పోరాటంతో ఇది ప్రభావం చూపుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని వెల్లడించింది. వెంటిలేటర్ దశకు చేరకుండా ఉండటానికి..రోగులుకు రెమిడెసివిర్ పెద్దగా ఆశాజనక ఫలితాలేమీ ఇవ్వడం లేదని తెలిపింది.
కరోనా వైరస్తో ఆస్పత్రిలో చేరిన ఏడు వేల మందిపై జరిపిన పరిశోధనల వివరాల్ని పరిశీలించిన తర్వాత డబ్ల్యూహెచ్వో ఈ ప్రకటన చేసింది. అయితే, రెమిడెసివిర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవని చెప్పడం మాత్రం తమ ఉద్దేశం కాదని వెల్లడించింది. కరోనా సోకినవారికి ఇస్తున్న సాధారణ చికిత్సతో పోలిస్తే ఈ డ్రగ్ అందించడానికి అవుతున్న ఖర్చు, ఇస్తున్న విధానం అంత ప్రయోజనకరంగా ఏమీ లేదన్నదే తమ అభిప్రాయం అని చెప్పింది.