కరోనా వైరస్ కారణంగా ఇంతకుముందు లాగ క్రికెటర్లు కలిసి తిరగే పరిస్థితులు లేవు ...ఎవరికీ వారే జాగ్రత్తలు తీసుకుంటూ బయో బబుల్ నిబంధనలు అతిక్రమించకుండా క్రికెట్ మ్యాచ్ లను ఆడుతున్నారు..అయితే వాటికి విరుద్ధంగా కివీస్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టు కరోనా నిబంధనలను అతిక్రమించింది..
క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు నిబంధనల్ని అతిక్రమించి ప్రవర్తించడం న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. 14 రోజుల క్వారంటైన్లో ఉన్న ఆటగాళ్లు తాము బస చేసిన హోటల్లో ఏ మాత్రం భౌతిక దూరం పాటించలేదు. పైగా భోజనాల సమయంలో ఒకరి ప్లేట్లోని పదార్థాల్ని ఇంకొకరు పంచుకున్నారు.
ఇవన్నీ హోటల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీనిపై కివీస్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం 12 రోజుల క్వారంటైన్ పూర్తయినప్పటికీ... ఈ అతిక్రమణ వల్ల కరోన పరీక్షల్లో ఎవరికైనా పాజిటివ్ అని తేలితే ఐసోలేషన్ వ్యవధిని పొడిగిస్తారు. కరీబియన్ క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా కలిసిమెలిసి తిని తిరిగిన వీడియో ఫుటేజీలను విండీస్ బోర్డుకు పంపించామని కివీస్ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆష్లే బ్లూమ్ఫీల్డ్ తెలిపారు.