నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రానికి రావొచ్చని వాతావరణ అధికారులు అంచనా

హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లలో అత్యధికంగా 12 సెంటీ మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్ జిల్లా సొనాలలో 6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 7 సెంటిమీటర్లు వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ తదితర చోట్ల పెద్ద వాన పడింది. బాలానగర్, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, చింతల్‌లోనూ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, మెహిదీపట్నంతో పాటు మేడిపల్లి, రామంతాపూర్‌లో కూడా వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 4.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవగా బాలానగర్‌లో 3.5, కూకట్‌పల్లిలో 3 సెంటిమీటర్ల వర్షం పడింది.

నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రానికి రావొచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిప్రభావంతోనే బుధ, గురు వారాల్లో ఓ మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు.