సరిహద్దు విషయంలో రాజీపడబోము ..భారత విదేశాంగ శాఖ



లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణపై భారత విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. 15వ తేదీ రాత్రి చైనా బలగాలు వాస్తవాధీన రేఖ దాటేందుకు యత్నించాయని తెలిపింది. ఆ సమయంలో భారత బలగాలు అడ్డుకున్నాయి తప్ప ఎల్‌ఏసీ రేఖ దాటలేదని వివరించింది.

చైనా ఘర్షణ జరగకుండా చూడాల్సిందని అభిప్రాయపడిన భారత విదేశాంగ శాఖ ఘర్షణలో రెండు వైపులా మరణాలు సంభవించాయని తెలిపింది. భారత్ శాంతి కోరుకుంటుంది కానీ సరిహద్దు విషయంలో రాజీ పడబోదని తేల్చి చెప్పింది. భారత్ ఎల్‌ఏసీ దాటబోదని, చైనా బలగాలు కూడా దాటకుండా ఉంటే మంచిదని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ భేటీ తర్వాత ఈ ప్రకటన విడుదల అయింది.

లడక్ గల్వాన్ లోయలో నిన్న రాత్రి జరిగిన ఘటనలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు జరిగిన మరణాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మంది గాయపడ్డారని సమాచారం.