జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా నిర్దిష్టమైన ఇతర గుర్తులున్నా వాటినీ లెక్కించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీ చేసిన సర్క్యులర్ను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్ను విచారించబోమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు జోక్యం చేసుకొనే అధికారం న్యాయస్థానాలకు ఉందని స్పష్టం చేసింది...
సింగిల్ జడ్జి ఉత్తర్వులతో ఒక డివిజన్ ఫలితాలు మాత్రమే ఆగిపోయాయని, సోమవారం ఈ కేసును సింగిల్ జడ్జి మొదటి కేసుగా విచారించనున్న నేపథ్యంలో అభ్యంతరాలుంటే అక్కడే చెప్పుకోవాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సరికాదని ఎస్ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదించగా... ఏ గుర్తు ఉన్నా ఆ బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కిం చాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీచేయడం నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమేనని స్పష్టం చేసింది.