డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్... ఎందుకో తెలుసా..!

కరోనా వైరస్ బారినపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్పత్రి నుంచి అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సోమవారం చేరుకున్నారు. ట్రంప్‌నకు కోవిడ్-19 నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఆయనను నాలుగు రోజుల కిందట వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్‌కు తరలించిన విషయం తెలిసిందే. ట్రంప్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు సిఫార్సు మేరకు ఆస్పత్రిలో చేరారు.

గత 72 గంటలుగా ఆయనకు జ్వరం రాలేదని, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సాధారణంగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ట్రంప్ ఊపిరితిత్తులపై వైరస్ ఏదైనా ప్రభావం చూపిందా లేదా చివరిసారిగా నిర్వహించిన కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో అధ్యక్షుడికి నెగెటివ్ వచ్చిందా అనే అంశాలను వెల్లడించడానికి వైద్యులు నిరాకరించారు. ట్రంప్‌నకు ఆస్పత్రిలో ఉన్నప్పుడు రెండుసార్లు ఆక్సిజన్ అందజేసినట్టు తెలిపారు.

వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి సర్జికల్ మాస్క్ ధరించి ట్రంప్ బయటకు వస్తూ విజయదరహాసం చేశారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ఎంత మంది సిబ్బంది కరోనా బారినపడ్డారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. చాలా ధన్యవాదాలు అంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం ట్విట్టర్‌లో తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేశారు. నిజంగా చాలా బాగుంది అని వ్యాఖ్యానించారు.

‘కోవిడ్-19కు భయపడవద్దు.. మీ జీవితం ఆధిపత్యం చెలాయించే అవకాశం ఇవ్వొద్దు.. ట్రంప్ పాలనలో అనేక మంచి ఔషధాలు అభివృద్ధి, విజ్ఞానం సాధించాం... 20 ఏళ్ల కిందట కంటే తాను ప్రస్తుతం చాలా బాగున్నా’ అని పేర్కొన్నారు. ట్రంప్ ఇంకా పూర్తిగా కోలుకుని ఉండకపోవచ్చు అని వైట్ హౌస్ వైద్యుడు డాక్టర్ సీన్ పి. కాన్లే అన్నారు.

ఆయన ఆరోగ్యం సోమవారం వరకు అదే విధంగా ఉండి లేదా మెరుగుపడితే ఇంకా మంచిది అని అన్నారు. వైట్‌హౌస్‌లో అధునాతన వైద్య సౌకర్యాలు ఉండటం వల్ల ట్రంప్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడమే మంచిదని వైద్యబృందాలు భావించి ఉంటాయని కాన్లే అన్నారు.