ఈసారి చాలా
ప్రతిష్టాత్మకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అని అందరూ
ఎదురు చూసారు. వరసగా రెండోసారి కూడా తెరాస విజయదుందుభి మోగించింది. నాడు ఒకే
ఒక్కడితో మొదలుపెట్టిన టీఆర్ఎస్ ప్రస్థానం నేడు వరుసగా రెండు సార్లు బల్దియా
పీఠాన్ని దక్కించుకుని గ్రేటర్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటింది. గ్రేటర్లో
బలం లేదంటూ నగుబాటునకు గురైన గులాబీ పార్టీ ఇప్పుడు సగర్వంగా కాలరెగరేసింది.
టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో
ఎన్నో వాగ్దానాలు చేసి చరిత్ర సృష్టిస్తూ సొంతంగా వరుసగా రెండోసారి మేయర్
స్థానాన్ని దక్కించుకుని తన సత్తా చాటుకున్నది. 2001లో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన
టీఆర్ఎస్ ఆ మరుసటి ఏడాది 2002లో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
(ఎంసీహెచ్) ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పటికి గ్రేటర్ హైదరాబాద్
ఆవిర్భవించలేదు. నాడు టీఆర్ఎస్ 50కి పైగా డివిజన్లలో పోటీ చేసినప్పటికీ, ఒకే
ఒక్క డివిజన్లో విజయం సాధించింది.
దీంతో ఆ ఒక్కరే ప్రస్తుత
డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు. అనంతరం ఎంసీహెచ్ కాస్త గ్రేటర్ హైదరాబాద్గా
రూపాంతరం చెందింది. ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారి
చివరి సారిగా 2009లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. కానీ టీఆర్ఎస్
అప్పుడు పోటీకి దూరంగా ఉనింది. గ్రేటర్లో బలం లేకపోవడంతోనే గులాబీ దళం పోటీ
చేయలేదని, అప్పుడు
అంతా గేలి చేశారు. కానీ టీఆర్ఎస్ మాత్రం రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమంపైనే
దృష్టి సారిం చి ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది.
తెలంగాణాలో ఆ తర్వాత
కాలక్రమంలో తెలంగాణ ఉద్యమ ఉధృతి, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్
అజేయశక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2016లో
జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99స్థానాలను గెలుచుకుని ఒంటరిగా మేయర్ స్థానాన్ని
దక్కించుకున్నది. తిరిగి తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లతో మేయర్ స్థానాన్ని
టీఆర్ఎస్ పదిలం చేసుకుంది. కానీ ఈసారి ఎవరు ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీనే
ఇచ్చింది.