GHMC Elections 2020: నేరెడ్‌మెట్ టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపు...!

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో 2020 నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు.

దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు.

సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగింది. నేరెడ్‌మెట్ డివిజన్ మొత్తంలో 25,176 ఓట్లు పోలవ్వగా 24,632 ఓట్లు లెక్కించారు.

డిసెంబర్ 4న లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం ఉదయం లెక్కించారు.

అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
స్వస్తిక్‌ గుర్తు కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్‌పై రాష్ట్ర బీజేపీ లీగల్‌సెల్‌ ఇన్‌చార్జి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇతర ముద్రతో ఉన్న ఓట్లను లెక్కించొద్దని ఈనెల 4న హైకోర్టును బీజేపీ ఆశ్రయించింది.సో దీనిపై m మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వాదనలతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది.

స్వస్తిక్‌ మార్క్‌ కాకుండా ఇతర మార్కులను ఉపయోగించి బ్యాలెట్‌ పేపర్‌పై ఓటు వేసినప్పుడు ఎన్నికల నియమాలు, 2005 రూల్‌ 51 ప్రకారం రిటర్నింగ్‌ అధికారికి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది.

దీంతో కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. కోర్టు వివాదాస్పద ఓట్లను లెక్కించాలని ఆదేశించింది. స్వస్తిక్‌తో పాటు ఇతర ముద్రతో ఉన్న ఓట్లను పరిగణలోనకి తీసుకోవాలంది హైకోర్టు.

కోర్టులో ఉన్న అడ్డంకులు తొలిగిపోవడంతో కౌంటింగ్ నిర్వహించారు అధికారులు. దీంతో ఓట్ల లెక్కింపును చేపట్టిన అధికారులు టీఆర్ఎస్ గెలుపొందినట్లు ప్రకటించారు.