మా గవర్నర్ ను తక్షణమే పదవి నుంచి తొలగించండి.. రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన తృణమూల్ ఎంపీలు


రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్‌ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాము సంతకాలు చేసిన మెమొరాండంను రాష్ట్రపతి భవన్‌కు పంపించారు.

కాగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గత కొన్నిరోజులుగా విమర్శల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి నేపథ్యంలో ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును తప్పుబడుతూ గవర్నర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఔట్‌సైడర్స్‌ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పద్ధతిగా మాట్లాడాలంటూ హితవు పలికారు. అదే విధంగా పోలీసులు తీరును విమర్శిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు..దీనితో తృణమూల్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్రపతిని కోరినట్లు వెల్లడించారు.