ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించి మరో గెలుపును నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడలేదు.
తొడ కండరాల గాయంతో పంత్ మ్యాచ్కు దూరమయ్యాడు. కాగా, పంత్ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన అయ్యర్ను పంత్ గురించి అడగ్గా ఇంకా ఎటువంటి స్పష్టత లేదన్నాడు. ‘ నాకైతే పంత్ అందుబాటులో ఉండటం గురించి తెలీదు. పంత్కు వారం రోజులు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పారు.
త్వరలోనే జట్టులో చేరతాడని ఆశిస్తున్నా. అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అనేది మాత్రం నాకైతే తెలీదు. ఆ నిర్ణయం మేనేజ్మెంట్ చూసుకుంటుంది’ అని తెలిపాడు. ఇక ఓటమి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(ఢిల్లీ) 10 నుంచి 15 పరుగులైతే తక్కువ చేశాం.
బోర్డుపై 170-175 పరుగులు ఉండి ఉంటే మ్యాచ్ మరొలా ఉండేది. ఆ కారణంగానే మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. మరొకవైపు స్టోయినిస్ రనౌట్ కావడం కూడా ప్రభావం చూపింది. స్టోయినిస్ బంతిని బాగా హిట్ చేస్తున్నాడు. స్టోయినిస్ వికెట్ను రనౌట్ రూపంలో కోల్పోవడం మేము మ్యాచ్లో చేసిన తప్పిదం. ఇది ఫలితంపై ప్రభావం చూపింది’ అని అయ్యర్ పేర్కొన్నాడు.