లాక్ డౌన్ కారణంగా ఐదేళ్ళ చిన్న పిల్లవాడు ఢిల్లీలో
చిక్కుకున్నాడు. ఆ బాబు తల్లిదండ్రులు
మాత్రం బెంగుళూరులో ఉంటున్నారు. అయితే, ఢిల్లీలోని
తమ బంధువుల ఇంటికి వెళ్లిన ఐదేళ్ళ బాబు తిరిగి వచ్చే సమయంలో లాక్ డౌన్ అమల్లోకి
వచ్చింది. దీంతో మూడు నెలలుగా ఢిల్లీలో ఉండిపోయాడు. అయితే, లాక్
డౌన్ ఆంక్షలు సడలించడం, విమానం
సర్వీసులు పునరుద్ధరించడంతో తమ బిడ్డను ఢిల్లీ నుంచి బెంగుళూరుకు రప్పించేందుకు
తల్లిదండ్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫలితంగా ఢిల్లీ నుంచి బెంగుళూరుకు
వచ్చిన విమానంలో ఐదేళ్ళ ఆ చిన్నబాబు కుటుంబ సభ్యులు లేకుండానే ఒంటరిగా వచ్చాడు.
ఈ విమానంలో ప్రయాణించిన వారంతా ఆ బాలుడిని ఆశ్చర్యంగా చూడసాగారు. ఆ బాబు పేరు విహాన్ శర్మ. వయసు ఐదేళ్లు. సోమవారం
ఢిల్లీ నుంచి బెంగుళూరుకు వచ్చిన విమానంలో ఈ విహాన్ శర్మ కెంపె గౌడ అంతర్జాతీయ
విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ తల్లి రిసీవ్ చేసుకుంది. అయితే, అధికారుల ఆదేశం మేరకు ఆ చిన్నోడికి హోం క్వారంటైన్కు
తరలించారు.
ఈ బాలుడిని స్పెషల్
కేటగిరీ ప్యాసింజర్గా విమాన సిబ్బంది గుర్తించి, సురక్షితంగా బెంగుళూరుకు తీసుకొచ్చారు. ప్రయాణ సమయంలో
ఈ బుడ్డోడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్లు ధరించి, చేతిలో మొబైల్ ఫోను పట్టుకుని వచ్చాడు.
ఢిల్లీలో అతని బంధువులు
విమానం ఎక్కించగా, బెంగుళూరులో
ఆ బాలుడి తల్లి రిసీవ్ చేసుకుంది. ఇంత చిన్న వయసులోనే ఢిల్లీ నుంచి బెంగుళూరుకు
ఒంటరిగా ప్రయాణించిన పిల్లవాడిగా విహాన్
శర్మ చరిత్ర సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో
వైరల్ అయింది.