దేశ ఆర్థిక రాజధాని ముంబై
కరోనా మహమ్మారిగా మారింది. నగరంలో గత కొంతకాలంగా కేసుల నమోదులో అనూహ్య పెరుగుదల
కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్న
నగరాల్లో ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కో తొలిస్థానంలో ఉన్నది. అయితే, మాస్కోను వెనక్కినెట్టేలా ఇటీవల ముంబైలో వైరస్ కేసుల
సంఖ్యలో అనూహ్య పెరుగుదల నమోదవుతున్నది.
మే మొదటి వారం నుంచి
ఇప్పటివరకూ కేసుల సంఖ్యలో మూడు రెట్లు పెరుగుదల నమోదైంది. ముంబై మొత్తం జనాభా
దాదాపు 1.8 కోట్లు. ఇందులో 0.22 శాతం
మందికి ఇప్పటికే వైరస్ సోకింది. మే 22న
ముంబైలో 1,751 కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు
నమోదైన నగరాల్లో మాస్కో తర్వాత ముంబై నిలిచింది. ఏడు రోజుల సగటు కేసులను పరిగణలోకి
తీసుకుంటే అత్యధిక కేసులు నమోదవుతున్న బ్రెజిల్లోని సావో పాలో నగరాన్ని ముంబై
ఇప్పటికే దాటివేసింది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద
మురికివాడగా పేరుగాంచిన ముంబైలోని ధారవి ప్రాంతంలో కేసుల సంఖ్య ఇటీవలి కాలంలో
పెరుగుతుండటం కూడా వైరస్ కేసులు గణనీయంగా పెరుగడానికి మరో కారణంగా ఉన్నది.
ఇప్పటివరకూ ధారవిలో 1,541
కేసులు నమోదయ్యాయి. 59 మంది
మృతిచెందారు.
దీంతోపాటు ఇప్పటివరకూ
నగరంలో 1,809 మంది పోలీసులకు కరోనా సోకినట్టు తేలగా, వైరస్ కారణంగా 12 మంది
మరణించారు. ప్రస్తుత గణాంకాల సరళిని విశ్లేషిస్తే రానున్న కాలంలో ప్రపంచంలో
అత్యధిక వైరస్ కేసులు నమోదయ్యే నగరాల్లో ముంబై అగ్ర స్థానానికి చేరుకోవచ్చని
నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 1,38,845 వైరస్ కేసులు నమోదుకాగా ఇందులో ఆరింట ఒకవంతు కేసులు
(30,359 కేసులు) ముంబైలోనే రికార్డయ్యాయి. ఇక దేశంలో కొవిడ్-19 కారణంగా 4,021 మంది
మరణించగా ఇందులో దాదాపు నాలుగో వంతు మరణాలు (988
మరణాలు) ముంబైలోనే సంభవించాయి.