ఏలూరు ప్రజల వింత
వ్యాధికి గల కారణాలపై పూర్తి స్థాయిలో జాతీయ పరిశోధన సంస్థలు పరిశోధనలు జరుపుతున్నారు.
ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఎన్ఐఎస్ శాస్త్రవేత్తలు పలు నమూనాలు
సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో
పాటు పలు నమూనాలు తీసుకున్నారు. తరువాత నీటి నమూనాలను విజయవాడలోని ఓ పరీక్షా
కేంద్రంలో పరిశీలించగా విస్మయపరిచే ఫలితాలు వెలువడ్డాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి
కాలువల్లోని నీటిని పరిశీలించగా హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు
ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా కాలువలో తీసుకున్న లీటర్ నీటిలో 17.84
మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో స్పష్టం అయ్యింది. సాధారణంగా ఈ
రసాయనం 0.001
మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని వైద్యులు అంటున్నారు. లూరు పరిసర ప్రాంతాల్లో ఉండే నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.
ఈ రసాయనం ప్రజల శరీరంలోకి
వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. అలాగే
ఆహారం లేదా నీటి కాలుష్యం వల్లే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు జాతీయ
పోషకాహార సంస్థ శాస్త్రవేత్త జేజే బాబు పేర్కొన్నారు. ప్రజలు అస్వస్థతకు
గురికావడానికి వాతావరణంలో సమస్యలు ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన చెప్పారు. బాధితుల
నుంచి రక్త, మూత్ర తదితర నమూనాలను తీసుకున్నామని తెలిపారు.
బాధితులు ఉన్న ప్రాంతాలతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని నీరు, కూరగాయలు, ఆహార
పదార్థలను పరీక్షలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక నివేదిక శుక్రవారం నాటికి
వస్తుందని దాన్ని ప్రభుత్వానికి అందిస్తామని శాస్ర్తవేత్త తెలిపారు. రోగుల నుంచి
తీసుకున్న నమూనాల్లో నికెల్, సీసం ఉండటం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు
ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటి వరకూ అస్వస్థతకు గురై 583 మంది
ఆస్పత్రుల్లో చేరారు. వీళ్లలో 470 మంది డిశ్చార్జి అయ్యారు. మెరుగైన చికిత్స కోసం 20 మంది
రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు.