సీబీఎస్ఈ 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు బోర్డు ప్రకటన


దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో విద్యా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతుండడంతో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. కరోనా రోజుకో రూపం మార్చుతుండడంతో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు కేంద్రం దిక్కు తోచని స్థితిలో పడిపోయాయి.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై అధిక భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి. సమయభావాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా సీబీఎస్ఈ కూడా 30 శాతం సిలబస్ తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 9 నుంచి 12వ తరగతి వరకు సిలబస్ ను కుదిస్తున్నామని అధికారికంగా ఓ ప్రకటనలో బోర్డు వెల్లడించింది.

ఈ నిర్ణయం 2020-21 విద్యా సంవత్సరానికి వర్తిస్తుందని పేర్కొంది. కరోనా పరిస్థితుల కారణంగా విద్యార్థులు నష్టపోయిన కాలం ఈ నిర్ణయం ద్వారా భర్తీ అవుతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. అయితే సిలబస్ కీలక పాఠ్యాంశాల జోలికి వెళ్లబోవడంలేదని స్పష్టం చేశారు. ఇకముందు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.