ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్


ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలియజేసారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఏపీలో పరీక్షలు కొనసాగుతాయా లేదా అన్న సస్పెన్స్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ క్లారిటీ ఇచ్చారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ఆయన అన్నారు.

జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పరీక్షలు రద్దు చేసినా ఏపీలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా కారణంగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తమ రాష్ట్రంలో మాత్రం పదో తరగతి పరీక్షలు కొనసాగుతాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.


తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసి గ్రేడింగ్ విధానంలో విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడంతో ఏపీలో ఈ అంశంపై ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందనే అంశంపై ఉత్కంఠగా నెలకొంది. ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారం జులై 10 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ సంవత్సరం ప్రతి సబ్జెక్టుకు ఒక్కో పేపర్‌తో మాత్రమే పరీక్ష నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. క్రితం 11 పరీక్షల పేపర్లు ఉండగా ప్రస్తుతం 6 పేపర్లకు బోర్డ్ కుదించింది. జులై 10న ఫస్ట్‌ లాంగ్వేజ్, జులై 11న సెకండ్‌ లాంగ్వేజ్, జులై 12న థర్డ్‌ లాంగ్వేజ్, జులై 13న గణితం, జులై 14 సామాన్య శాస్త్రం, జులై 15న సాంఘీక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయం అని ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.