అమెరికాలో జలపాతం దగ్గర సెల్ఫీ తీసుకుంటూ జారిపడి తెలుగు యువతి దుర్మరణం


అమెరికాలో తెలుగు యువతి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు లక్ష్మణరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

రెండో కుమార్తె కమల గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికా వెళ్లారు.. ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం కొలంబియాలో నివాసం ఉంటున్నారు. శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొస్తూ మధ్యలో అట్లాంటా సమీపంలోని జలపాతం దగ్గర ఆగారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి కన్నుమూశారు..

జలపాతం దగ్గర సహాయక సిబ్బంది డెడ్‌బాడీని బయటకు తీశారు. కమల మరణ వార్తను కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. కూతురి మరణంతో తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్న సమయంలో మరణం వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకొచ్చేందుకు సహకరించాలని పేరెంట్స్ కోరుతున్నారు. నాట్స్‌ సహకారంతో మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.