రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ధరణి సేవలు విజయవంతంగా ప్రారంభమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణిసేవల ప్రారంభ కార్య్రక్రమాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా తనికీ చేశారు.
ఈ సందర్బంగా ధరణి ద్వారా చేసిన తొలి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను మంచాల ప్రశాంతికి సీఎస్ అందజేశారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, అడిషనల్ కలెక్టర్ హరీష్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ధరణి ద్వారా రిజిస్ర్టేషన్లకు మంచి స్పందన వస్తుందన్నారు.
సోమవారం ఉదయం 10:30 గంటల వరకు 946 మంది రిజిస్ర్టేషన్లకు నగదు చెల్లించారని, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నారని తెలిపారు. అక్కడక్కడా స్వల్ప సాంకేతిక సమస్యలు మినహా రిజిస్ట్రేషన్లు విజయవంతంగా ప్రారంభమయ్యాయని సోమేశ్ కుమార్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో రిజిస్ర్టేషన్లు అమలవుతాయని అన్నారు.