అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఈ ఉదయం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్రమోదీ.. ఆయన చేతుల మీదుగానే ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ నేపథ్యంలో రాముడి గురించి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. శ్రీరాముడు ఉత్తమ మానవీయ విలువలు కలిగిన వాడని, రాముడంటే మానవత్వమని ట్విట్టర్లో పేర్కొన్నారు.
మానవుల మనసు లోతుల్లో ఉన్న మానవత్వానికి శ్రీరాముడి మనవీయ విలువలే కారణమని రాహుల్గాంధీ పేర్కొన్నారు. రాముడంటే ప్రేమ. ఆయనకు ప్రేమించడమే తప్ప, అసహ్యించుకోవడం తెలియదు. రాముడంటే అప్యాయత. ఆయనకు జాలి చూపడమే తప్ప హింసించడం తెలియదు. రాముడంటే న్యాయం. ఆయన అన్యాయాన్ని ఏమాత్రం సహించడు అని ఆయన ట్వీట్ చేశారు.
ఇక మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు మోడీ .. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు. రామమందిరం ఇకపై భవ్య మందిరంగా రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందని చెప్పారు. రామమందిరం నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితమిది. రాముడు అందరి మనసులో నిండి ఉన్నారని మోదీ పేర్కొన్నారు.