రజినీకాంత్ పార్టీ ఏర్పాటు విషయమై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు...


సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. జనవరిలో పార్టీ పేరును, విధివిధానాలను పేర్కొన్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చెప్పారు. 2017లోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలు ఉన్నప్పటికీ జయలలిత, కరుణానిధి మరణంతో తమిళనాట రాజకీయ పరిస్థితులు మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెడితే ప్రయోజనం ఉంటుందని రజినీకాంత్ అనుకుంటున్నారు. రజినీ రాజకీయపార్టీ ఏర్పాటు విషయమై రాజకీయ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ ఏర్పాటు విషయమై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘2013లో బీజేపీలో తాను జనతాపార్టీని విలీనం చేస్తున్నానని ప్రకటించిన తర్వాత అప్పటి జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యకర్తలను తమిళనాడు బీజేపీని దూరం పెట్టింది. కానీ బీజేపీ మాత్రం డీఎంకే, ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలోకి ఆహ్వానించింది. గతంలో జనతా పార్టీ కోసం పని చేసిన వారంతా రజినీకాంత్ పార్టీలో చేరే అవకాశం ఉంది’’ అని సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. సుబ్రమణ్యస్వామి ట్వీట్‌ను చూస్తుంటే గతంలో ఆయనతో కలిసి జనతా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు రజినీకాంత్ వెంట నిలిచే ఛాన్సెస్ ఉన్నాయి.