రాజస్థాన్‌ మాజీ ఆర్థిక శాఖ మంత్రి మరణం


అనారోగ్యం మరియు వయసు పైబడడంతో రాజస్థాన్ మాజీ మంత్రి తుది శ్వాస విడిచారు. రాజస్థాన్‌ మాజీ ఆర్థిక శాఖ మంత్రి మాణిక్‌ చంద్‌ సురానా (89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం జైపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత నెల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు విచారం వ్యక్తం చేశారు.

మాణిక్‌ చంద్‌ సురానా మృతిపట్ల రాజస్థాన్‌ గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, సీఎం అశోక్‌ గెహ్లాట్‌, మాజీ సీఎం వసుంధర రాజేతోపాటు పలువురు ప్రముఖులు అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురాన అంత్యక్రియలను గురువారం ఆయన స్వగ్రామం బికనేర్‌లో నిర్వహించనున్నారు. సురానా 1931, మార్చి 31న జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. కళాశాల రోజుల్లో బికనేర్‌ దోన్‌గర్‌ కళాశాల అధ్యక్షుడిగా వ్యవహరించారు.

అయన 1977 నుంచి 1980 వరకు బీజేపీ ప్రభుత్వంలోని బైరాన్‌ సింగ్‌ షకావత్‌ క్యాబినెట్‌లో ఆయన ఆర్థిక మంత్రిగా కొనసాగారు. బికనేర్‌ జిల్లాలోని లంకరాన్సర్ నియోజకవర్గం నుంచి 1977లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళీ 1985 ఎన్నికల్లోనూ అదేపార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తరువాత జనతా పార్టీ (ప్రోగ్రెసివ్‌)ను స్థాపించారు. రాష్ట్రంలో పార్టీకి ఆశించిన మేర ప్రజాదరణ లభించకపోవడంతో 2000 సంత్సరంలో బీజేపీలో విలీనం చేశారు.