తెలంగాణ వ్యాప్తంగా
ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల
నాలుగైదు రోజులుగా జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరైన వర్షం
కూడా పడకపోవడంతో వాతావరణం కూడా వేడిగా మారింది. దీంతో ఇళ్లలో ఉండలేక పోతున్నారు.
అటు ఎండ కూడా బాగానే కాస్తుంది. అయితే రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో
తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ
కేంద్రం వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు
చోట్ల పొడి వాతావరణం ఉంటుందని, రెండు నుంచి 3 డిగ్రీలు అధికంగా పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు
నమోదవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన
అల్పపీడనానికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు
తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు
చెబుతున్నారు. వర్షం పడాలని జనం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు.