కేరళ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకడం కేరళపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కేరళలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన కేరళ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నది. కుండపోత వర్షాల కారణంగా కేరళలోని కోజికోడ్ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది.
ఆ జిల్లాలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధికారులు కోజికోడ్కు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.కోజీకోడ్తోపాటు కేరళలోని త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్, తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, వెల్లనిక్కర, అలప్పుజ, వైతిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో మొత్తం 13 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీచేసింది. తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట జిల్లాలు మినహా మిగతా జిల్లాలకు బుధవారం కూడా యెల్లో అలర్ట్ జారీ అయ్యింది. త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు గురువారానికి కూడా యెల్లో అలర్ట్ జారీ అయ్యింది.
సాధారణంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. ఆయా జిల్లాల్లో 6 సెం.మీ. నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు నమోదయ్యే జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేస్తారు. ఈ జిల్లాల్లో 6 సెం.మీ. నుంచి 11 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉంటుంది.