దుబ్బాక ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం....


నవంబర్ 10న దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు సాగింది. తక్కువ ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అయితే రఘనందన్‌రావు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటిగంటకు స్పీకర్‌ ఛాంబర్‌లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘనందన్‌రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ 1118 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డికి 21, 819 ఓట్లు వచ్చాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌ టీ-20 మ్యాచ్‌ను తలపించి౦ది.