దేవుడి దయ , మీ ప్రార్ధనల వలన నాన్నగారి ఆరోగ్యం కొంచెం మెరుగయింది..ప్రణబ్ ముఖర్జీ కొడుకు


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అభిజిత్.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ‘నాన్న చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు శనివారం వెళ్లి ఆయనను చూశాను..

దేవుడి దయ, అందరి ప్రార్ధనలతో పరిస్థితి మెరుగుపడింది.. ఇంతకు ముందుకంటే స్థిరంగా ఉన్నారు.. చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారు! త్వరలోనే మన మధ్య తిరిగి వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈనెల 10న ఆసుపత్రిలో చేరిన ప్రణబ్‌కు సోమవారం శస్త్రచికిత్స చేశారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రణబ్‌ కొవిడ్‌-19తో కూడా బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. గురువారం కూడా ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలియవచ్చింది. అయితే ప్రణబ్‌ ఆరోగ్యంపై వస్తున్న వివిధ పుకార్లను కుమారుడు అభిజిత్‌, శర్మిష్ఠ ఖండించారు.