పవన్‌ జన్మదిన వేడుకల్లో విషాధం

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకలకు బ్యానర్లు కడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.మృతులను సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.


మాటలకు అందని విషాదం: పవన్‌కల్యాణ్‌
జనసేన అభిమానుల మృతి పట్ల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘జనసైనికుల మరణం మాటలకు అందని విషాదం. రాజేంద్ర, సోమశేఖర్‌, అరుణాచలం మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతంతో మరణించారన్న వార్త ఎంతగానో కలచివేసింది.

మాటలకు అందని విషాదం.. తల్లిదండ్రుల గర్భశోకం అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను.. ఆ తల్లిదండ్రులకు నేనే బిడ్డగా నిలుస్తాను. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాను. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రమాద ఘటనలో మరికొందరు జనసైనికులు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారికి సరైన వైద్య సేవలు అందేలా చూడాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.