జనాభా ఆధారంగా వైరస్ సంక్రమణను పసిగట్టేందుకు చేపట్టే సెరలాజికల్ సర్వేలో కీలక వివరాలు వెలుగుచూస్తున్నాయి. చెన్నైలో ఇప్పటికే ప్రతి ఐదుగురిలో ఒకరు కరోనా వైరస్ బారినపడినట్టు వెల్లడైంది. ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా కోవిడ్ సెరో సర్వేలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక చెన్నై జనాభాలో 21.5 శాతం మంది ఇప్పటికే కోవిడ్-19 బారినపడగా నగర జనాభాలో 80 శాతం మంది వైరస్ సోకే అనుమానిత జాబితాలో ఉన్నట్టు సర్వే తెలిపింది. నగరంలోని వివిధ జోన్లలో వ్యాధి సంక్రమణ వివిధ స్ధాయిల్లో ఉందని పేర్కొంది. చెన్నైలో 15 జోన్లకు చెందిన 51 వార్డుల్లో 12,405 రక్త నమూనాలను సేకరించి పరీక్షించగా 2673 మందికి గతంలో కోవిడ్-19 సోకిందని సర్వే గుర్తించింది.
కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీ బాడీలను గుర్తించేందుకు వ్యక్తుల రక్త నమూనాలను సెరో సర్వేలో పరీక్షిస్తారు. కోవిడ్-19 సంక్రమణను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సెరో సర్వేలు నిర్వహిస్తున్న క్రమంలో చెన్నైలో చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెలుగుచూశాయి.