ఎన్నికలు దగ్గర పడుతున్న
వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సొంతింట్లోనే వ్యతిరేకత ఎదురవుతోంది.
వారసత్వంగా తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ట్రంప్తో పాటు ఇతర కుటుంబసభ్యులు
తనను మోసం చేశారని ఆయన మేనకోడలు మేరీ ట్రంప్ దావా వేశారు. ఆమె ఫిర్యాదు మేరకు
న్యూయార్క్ స్టేట్ కోర్టులో ట్రంప్పై కేసు నమోదైంది.
తన తాత ఫ్రెడ్ ట్రంప్కు
సంబంధించిన ఎస్టేట్లో తనకు వాటా రావాల్సి ఉందని, దాని విలువ సుమారు 10 లక్షల
డాలర్లు ఉంటుందని మేరీ ట్రంప్ తన పిటిషన్లో తెలిపారు. న్యాయంగా తనకు దక్కాల్సిన
వారసత్వ ఆస్తులను తనకు ఇవ్వకుండా డొనాల్డ్ ట్రంప్, ఆయన
సోదరి మేరీ అన్నె, సోదరుడు రాబర్ట్ ట్రంప్ మోసం చేశారని మేరీ ట్రంప్
ఆరోపించారు. అయితే ఆమె పిటిషన్పై
స్పందించేందుకు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యుల తరఫు న్యాయవాదులు నిరాకరించారు.
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమెరికాలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.