నేపాల్ ప్రధానిగా బాధ్యతలు
స్వీకరించినప్పటి నుంచీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేపీ శర్మ ఓలి..
తాజాగా చైనా రాయబారి హౌ యాన్కీకి షాకిచ్చారు. తన పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని
ఎదుర్కొనే సామర్థ్యం తనకుందని, ఈ విషయంలో ఇతర దేశాల సహాయం తనకు అవసరం లేదని
ఆయన తేల్చి చెప్పడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో వస్తోంది. అధికార నేషనల్ కమ్యూనిస్ట్
పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు. ప్రధాని ఓలికి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉంది. ఈ వర్గాన్ని మాజీ
ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ లీడ్ చేస్తున్నారు.
తాను పార్టీలో చీలికకు
కూడా సిద్ధమేనని ఓలి చెబుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అది జరగకూడదని
చైనా భావిస్తోంది. అవసరమైతే పార్టీలో చీలికను ఆపడానికి ఓలిని ప్రధాని పదవి
నుంచి దించాలని కూడా చైనా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చైనాపై
ఓలి గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో భారత్తో చెడిన సంబంధాలను మళ్లీ గాడిన
పెట్టే ప్రయత్నంలో ఓలి ఉన్నారు. రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైన
కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్
ప్రాంతాలపై భారత్తో చర్చలు ప్రారంభించాలని కూడా ఆయన భావిస్తున్న నేపథ్యంలో
ఆయన ఇలా చైనాకు దూరం జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.