నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు అయింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను కడప జైలుకు తరలించిన నేపథ్యంలో ఆయన కడపకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందుగా ఆయన అనంతపురంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్ నేపథ్యంలో జేసీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించాలని అనుకున్నారు లోకేష్. దీంతోనే అనంతపురం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జేసీ ప్రభాకర్, అస్మిత్‌ను కడప జైలుకు తరలించారు. దీంతో లోకేష్ తన అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నారు.




దివాకర్ ట్రావెల్స్ లో జరిగిన అక్రమాల కేసులో నిన్న అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు కడప కేంద్ర కర్మాగారానికి తరలించారు. వీరిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, రెండు వారాల రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. తొలుత వీరిని అనంతపురం జైలుకు తరలించాలని భావించారు. అక్కడ కరోనా లక్షణాలున్న ఖైదీలు కొందరు ఉండటంతో జైలు అధికారులు వీరిని లోనికి రానిచ్చేందుకు అంగీకరించలేదు.

దీంతో పోలీసులు విషయాన్ని న్యాయమూర్తికి తెలియజేయడంతో తాడిపత్రి తరలించాలని సూచించారు. అయితే తాడిపత్రి జైలుకు తరలిస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న ఉద్దేశంతో పోలీసులు, వీరిని కడపకు తరలించారు. వీరిద్దరు ప్రస్తుతం కడప జైలులో ఉండటంతో వారిని కలిసేందుకు నారా లోకేష్‌ కడప వెళ్లనున్నారు. అందుకే తన అనంత పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు.