ప్రపంచ క్రికెట్లో తన స్పిన్ మాయాజాలంతో పలు రికార్డులను నమోదు చేసుకున్న శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. కొద్ది రోజులుగా ఆయన బయోపిక్కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండగా, ఈ బయోపిక్లో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.చిత్రానికి 800 అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6గం.లకు చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది.
ప్రపంచ క్రికెట్లో పలు రికార్డులు తన పేరుపై లిఖించుకున్న మురళీధరన్ వన్డేలతోపాటు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసారు. వన్డేల్లో మురళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నిర్మించబోయే చిత్రం పేరు 800కు ఈ రికార్డే స్ఫూర్తి అని తెలుస్తోంది. 2011లో రిటైర్మెంట్ ప్రకటించాక వివిధ టీ20 టోర్నీల్లో మురళీ ఆడాడు. అనంతరం కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు స్పిన్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.
మురళీ బౌలింగ్ శైలితోపాటు మ్యానరిజమ్స్ను విజయ్ సేతుపతి ఔపాసన పడుతున్నాడు. అతను పాత్రతో పక్కాగా మెప్పిస్తాడని నిర్మాతలు భావిస్తున్నారు. మురళి స్నేహితుడు, ప్రముఖ క్రికెటర్ కమ్ కామెంటేటర్ రసెల్ ఆర్నాల్డ్ పాత్రలో కమెడియన్ యోగి బాబు మెరవనున్నట్లు తెలుస్తోంది. కాగా, మురళీధరన్కు భారత్తో ఎంతో అనుబంధముంది. తమిళనాడుకు చెందిన యువతినే తను వివాహమాడాడు. మురళీధరన్ బయోపిక్ కోసం క్రికెట్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు